వాహనదారులకు ఊరట.. ఎక్సైజ్ డ్యూటీలో భారీ తగ్గింపు

  • పెట్రోల్, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గింపు
  • లీటర్ పెట్రోల్‌పై సుంకం రూ.3.. డీజిల్‌పై సున్నా
  • అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
  • హ‌ర్మూజ్ జలసంధి దిగ్బంధంతో పెరిగిన ముడిచమురు ధరలు
  • వినియోగదారులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలు
అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.10 చొప్పున తగ్గిస్తూ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం కేవలం రూ.3కు చేరగా, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసి సున్నాకు తగ్గించింది.

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ యుద్ధం కారణంగా ఇరాన్.. హ‌ర్మూజ్ జలసంధిపై దిగ్బంధం విధించడంతో ముడిచమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచంలోని మొత్తం ముడిచమురు, గ్యాస్ సరఫరాలో ఐదో వంతు (రోజుకు 20 నుంచి 25 మిలియన్ బ్యారెళ్లు) ఇదే మార్గం గుండా రవాణా అవుతుంది.

యుద్ధానికి ముందు ఈ మార్గం ద్వారా రవాణా అయ్యే చమురులో 12 నుంచి 15 శాతం వరకు భారత్ కొనుగోలు చేసేది. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు పెరిగి, దేశీయంగా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో సామాన్యులకు కొంత ఉపశమనం లభించనుంది.

Excise Duty
Petrol
Diesel
Fuel Crisis
Iran
Crude Oil
Hormuz Strait
Fuel Prices
India

More Telugu News